USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు!
ఇందూర్తి మేటిచందాపురం గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్న కుంభం ప్రీతిశ్రీనివాస్ దంపతులు
దేవాలయాలకు లక్షల్లో విరాళాలు - గ్రామ సేవలో ముందుండే మనసున్న మానవులు
సూర్య ప్రతినిధి, మర్రిగూడ : ఊరిని మర్చిపోకపోవడమే నిజమైన అభివృద్ధి అనే మాటకు ఉన్నతంగా నిలుస్తున్నారు కుంభం ప్రీతి, శ్రీనివాస్ రెడ్డి దంపతులు. మండలంలోని ఇందూర్తి మేటిచందాపురం గ్రామానికి చెందిన ఈ దంపతులు గత కొంతకాలంగా అమెరికాలో స్థిరపడి ఉన్నప్పటికీ, పుట్టిన ఊరిని మర్చిపోకుండా తమ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
భార్యాభర్తలిద్దరూ భగవంతుడిచ్చిన సౌఖ్యంతో విదేశాల్లో ఉన్నతంగా జీవిస్తూ, గ్రామాభివృద్ధికి తమ వంతు భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో, గత సంవత్సరం ఇందూర్తి గ్రామంలో ఏర్పాటైన “గ్రామ బొడ్రాయి (నాభి శిల)” ఉత్సవాల కోసం రూ. 5 లక్షలు, ప్రస్తుతం జరుగుతున్నా తృతీయ వార్షికోత్సవానికి రూ. 1లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. అదేకాకుండా, అంతంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివాలయం కోసం రూ. 15 లక్షలు విరాళంగా అందజేయడం గ్రామస్థుల మనసులను గెలుచుకుంది.
గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా, తమకు అందుబాటులో ఉన్న అన్ని విధాలా స్పందిస్తూ, ఆదర్శాన్ని చూపుతున్న ఈ దంపతులు స్థానిక నాయకులు అయితగోని యాదగిరి గౌడ్ సారథ్యంలో గ్రామానికి శాశ్వత అండగా నిలుస్తున్నారు.
వీరి సేవా దృక్పథం చూస్తే, వాస్తవంగా "భూమికి చేసిన ఋణం తీర్చుకోవడానికి తిరిగి మనం చేసే సేవలే మార్గం" అన్న మాట గుర్తుకు వస్తుంది. గ్రామంలో విద్య, దేవాలయాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో చొరవ తీసుకుంటూ, గ్రామ అభివృద్ధికి పెద్ద పట్టు పడుతున్నారు. ఇలాంటి మనసున్న దాతలు గ్రామ అభివృద్ధికి ఆశాజ్యోతి అని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గ్రామమంతా ఈ దంపతులపై నిరాజనాలు పొగడ్తలతో, వారికి అభినందనలు తెలుపుతున్నారు.