ఇందిరమ్మ ఇండ్ల పథకం - త్వరలో ధరల నియంత్రణ కమిటీలు
సూర్య, వలిగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటికే తొలి విడత లబ్ధిదారులను ఎంపిక చేయగా కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజుల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. అయితే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో నిర్మాణ సామాగ్రి ధరలను వ్యాపారులు పెంచినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది. దీంతో హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ దృష్టి సారించి మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ కమిటీలో మండల తహసిల్దార్, ఎంపీడీవో, లేబర్ ఆఫీసర్, హౌసింగ్ ఇంజనీర్లు ఉండనున్నారు. ఈ కమిటీ నిరంతరం నిర్మాణ సామాగ్రి ధరలను గమనిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టడం జరగనుంది. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు నిర్మాణ సామాగ్రికి అధిక ధరలు చెల్లించకుండా ఉండేందుకు తోడ్పడడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.